అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉంటాం... ఆయన రావాల్సిందే: తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

  • రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలంటూ ఏడాది క్రితం హైకోర్టు ఆదేశాలు
  • తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
  • అర్ధరాత్రి వరకు కోర్టు హాల్లోనే ఉంటాం.. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని ఆదేశం

తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శిపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలంటూ ఏడాది క్రితమే ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గతంలోనే ఆదేశించినా, ఫైనాన్స్ సెక్రటరీ కోర్టుకు రాకపోవడంపై ధర్మాసనం నిప్పులు చెరిగింది.


అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన హాజరు కాలేకపోయారని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరణ ఇవ్వగా, హైకోర్టు దానిని ఏమాత్రం అంగీకరించలేదు. "అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని కార్యదర్శికి ముందే తెలుసు కదా? మరి ముందే న్యాయస్థానం అనుమతి ఎందుకు తీసుకోలేదు?" అని ప్రశ్నించింది.


ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. "వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదు. మేము ఈ రోజు అర్ధరాత్రి వరకు కోర్టు హాలులోనే ఉంటాం... ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాల్సిందే" అని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చి ఆరు నెలలు గడిచినా బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమని, ఈ కాలంలోనే తమకు రావాల్సిన డబ్బులు అందక పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించారన్న వార్తలు రావడం బాధాకరమని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరించే అంశాలను ఏమాత్రం ఉపేక్షించబోమని, చట్టం అందరికీ సమానమేనని హైకోర్టు ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించింది.


Telangana Finance Secretary
Telangana High Court
retired employees dues
court orders
assembly sessions
court contempt
pension payments
government lawyer
justice system

More Telugu News